ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు నౌకల భద్రతను పర్యవేక్షించడానికి ట్రంప్ మిత్రదేశాల సాయాన్ని కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాలు తమ సొంత యుద్ధనౌకలను అక్కడ మోహరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. "ప్రపంచ దేశాలు తమ నౌకలను తామే ఎందుకు రక్షించుకోవు? ఇన్నాళ్లు మేము రక్షణ ఇచ్చాం, ఇప్పుడు ఆ బాధ్యత మీదే" అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆ దేశాలు ఈ సైనిక కూటమిలో చేరలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్కు అతిపెద్ద షాక్ టోక్యో నుంచే తగిలింది. హోర్ముజ్ జలసంధి వద్ద ఎటువంటి భద్రతా కార్యకలాపాల్లో పాల్గొనే ఆలోచన తమకు లేదని జపాన్ తేల్చి చెప్పింది. తమ ఇంధన అవసరాల కోసం ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలపై ఆధారపడిన జపాన్, అమెరికా కోసం ఇరాన్తో నేరుగా వైరాన్ని కోరుకోవడం లేదు. అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా పేరున్న ఆస్ట్రేలియా కూడా హోర్ముజ్ ప్రాంతానికి తమ యుద్ధనౌకలను పంపలేమని స్పష్టం చేసింది. దక్షిణ కొరియా కూడా దాదాపు ఇదే బాటలో నడిచింది. అమెరికా అభ్యర్థనను సమీక్షిస్తామని దౌత్యపరంగా సమాధానమిచ్చినప్పటికీ ప్రస్తుతం యుద్ధనౌకలను పంపే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేసింది.బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఈ అమెరికన్ కూటమిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. అమెరికా - ఇరాన్ గొడవలో చిక్కుకుని ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అవి భావిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ 'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో ముందుకు సాగుతుంటారు. అయితే హోర్ముజ్ సంక్షోభంలో ఈ వ్యూహం ఆయనకే ప్రతిబంధకంగా మారింది. ప్రపంచ చమురులో 20 శాతం ప్రయాణించే ఈ మార్గంలో భద్రత పేరుతో తమ యుద్ధనౌకలను రిస్క్లో పెట్టడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ప్రభావం తగ్గుతోందనడానికి ఇది ఓ సంకేతంగా నిలుస్తోంది.
0 Comments