Ad Code

కోకాపేట్‌ భూములు శారదా పీఠానికే చెందుతాయి : మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో 'సమాచార లోపం' వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆదివారం కోకాపేట్ లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి... అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ మాపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Close Menu