Ad Code

ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీ లైసెన్సులు రద్దు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం


హారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు మంజూరు చేసిన తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసింది. నిర్ణీత గడువులోగా ఈ కంపెనీలు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శాసన మండలిలో మాట్లాడుతూ ఈ కంపెనీలకు కొన్ని షరతులతో కూడిన తాత్కాలిక అనుమతులు ఇచ్చామని తెలిపారు. అయితే, గడువు ముగిసినప్పటికీ అవసరమైన పత్రాలను సమర్పించడంలో ఇవి విఫలమయ్యాయి. నిబంధనలను పాటించడం ప్రతి కంపెనీకి తప్పనిసరని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. 'మహారాష్ట్ర ఈ-బైక్ టాక్సీ నియమావళి 2024' ప్రకారం ప్రభుత్వం బైక్ టాక్సీలకు అనుమతి ఇచ్చింది.  బైక్ టాక్సీలుగా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే వాడాలి. అనుమతి పొందిన 30 రోజుల్లోగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. పర్యావరణాన్ని రక్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ఈ విధానం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో, పలు కంపెనీలు పత్రాలు సమర్పించలేదని తేలింది. దీంతో వెంటనే వాటి తాత్కాలిక లైసెన్సులను రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu