గుజరాత్లోని వాడినార్లో ఉన్న నాయరా ఎనర్జీ ప్లాంట్ను 35 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని యోచిస్తోంది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీని టైమింగ్ ఇప్పుడు మార్కెట్ నిపుణులను, పెట్రోల్ బంక్ డీలర్లను కలవరపెడుతోంది. నాయరా ఎనర్జీ రిఫైనరీ ఏడాదికి 2 కోట్ల టన్నుల ముడిచమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది భారతదేశ మొత్తం రిఫైనింగ్ సామర్థ్యంలో దాదాపు 8%. 35 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోతే మార్కెట్లో పెట్రోల్, డీజిల్ సరఫరా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నాయరా ఎనర్జీ దేశవ్యాప్తంగా 6,300 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. మార్చి చివరి నుండి ఏప్రిల్ వరకు కొనసాగే ఈ షట్డౌన్ కారణంగా రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల కష్టాలు పెరగవచ్చు. సాధారణంగా షట్డౌన్ సమయంలో కంపెనీలు ముందుగానే స్టాక్ను నిల్వ చేసుకుంటాయి లేదా ఇతర కంపెనీల నుండి కొనుగోలు చేసి సరఫరాను కొనసాగిస్తాయి. 35 రోజుల పాటు ఇంత పెద్ద రిఫైనరీ మూతపడటం వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగి 'పానిక్ బయింగ్' (అవసరం కంటే ఎక్కువ కొనుగోలు చేయడం) జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రాంతీయ స్థాయిలో ఇంధన లభ్యతపై ప్రభావం పడవచ్చు. నాయరా బంకుల్లో సరఫరా తగ్గితే, ఆ భారం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్,బీపీఎల్,హెచ్పీసీఎల్ నెట్వర్క్పై పడుతుంది. ప్రభుత్వ బంకుల వద్ద రద్దీ పెరిగితే అక్కడ కూడా స్టాక్ త్వరగా అయిపోవడం, లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా నాయరా ఎనర్జీకి పట్టున్న గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
0 Comments