Ad Code

కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ.160 కోట్ల మేర అవకతవకలు !


ర్యానాలోని చండీగఢ్‌ ఐడీఎఫ్‌సీ బ్యాంకు శాఖలో రూ.590 కోట్ల మోసం బయటపడిన నెల రోజుల తర్వాత, కోటక్ మహీంద్రా బ్యాంకులో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో సుమారు రూ.160 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఫిక్సిడ్‌ డిపాజిట్లు స్థానిక కోటక్ మహీంద్రా బ్యాంక్‌ బ్రాంచ్‌లో చాలా కాలంగా ఉన్నాయి. కాగా, రూ.58 కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్‌కు సంబంధించిన మెచ్యూరిటీ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయాలని కోటక్ మహీంద్రా బ్యాంకును పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌ కోరింది. కార్పొరేషన్‌ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్లు బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వచ్చింది. అయితే బ్యాంకు ఖాతాలోకి ఆ నిధులు జమ కాలేదు. దీనిపై ఆరా తీయగా ఆ బ్యాంక్‌ స్టేట్‌మెంట్ నకిలీ అని నిర్ధారణ అయ్యింది. ఫిక్సిడ్‌ డిపాజిట్‌ డబ్బు మాయమైనట్లు తెలుసుకుని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌ షాక్‌ అయ్యింది. మరోవైపు మిగతా ఎఫ్‌డీఆర్‌లలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీంతో ఈ మొత్తం మోసం రూ.160 కోట్లుగా తేలింది. కొంతమంది మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, బ్యాంకు ఉద్యోగులతో కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీని గురించి రాష్ట్ర విజిలెన్స్‌కు నివేదిక ఇవ్వడంతోపాటు ఆ బ్యాంకుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఆ బ్యాంకును డీ ఎంప్యానెల్ చేయాలని హర్యానా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ కూడా ఈ స్కామ్‌పై దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎఫ్‌డీఆర్‌లలో జరిగిన రూ.160 కోట్ల మోసాన్ని అంతర్గత ఆడిట్‌లో నిర్ధారించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్‌ అధికారి తెలిపారు. పంచకుల పోలీస్‌ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌పై దర్యాప్తులో మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధ సంస్థలకు బ్యాంక్ పూర్తిగా సహకారం అందిస్తున్నదని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu