Ad Code

దూరదర్శన్‌ మాజీ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి కన్నుమూత


దూరదర్శన్‌ మాజీ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి 71 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సరళ మహేశ్వరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దూరదర్శన్‌ నేషనల్‌.. 'X' వేదికగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా వార్తా రంగంలో ఆమె సేవలను గుర్తు చేసుకుంది. 1984 వరకు దూరదర్శన్‌లోనే పనిచేశారామె. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో దూరదర్శన్‌లో అనౌన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా రంగంలో తన గంభీరమైన స్వరంతో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. న్యూస్ రీడర్ అనే భావన సాధారణం కాకముందు హుందాగా స్పష్టమైన ఉచ్చారణతో వార్తలను చదువుతూ న్యూస్‌ రీడర్‌గా ప్రస్థానం ప్రారంభించాలనుకునే యువ యాంకర్లకు మార్గదర్శకంగా నిలిచారామె. "దూరదర్శన్ కుటుంబం తరపున.. సరళ మహేశ్వరికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. దూరదర్శన్ న్యూస్ రీడర్‌గా.. ఆమె సున్నితమైన స్వరం, కచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన డెలివరీతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సింప్లిసిటీ, సంయమనం, వ్యక్తిత్వం.. ప్రేక్షకులలో లోతైన నమ్మకాన్ని కలిగించాయి" అని పోస్ట్‌ చేసింది. మహేశ్వరి మరణాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్.. "టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణయుగం ముగింపు"గా అభివర్ణించింది. ఆమె విశ్వసనీయత, మర్యాద ఎల్లప్పుడూ రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయని పేర్కొంది. ప్రశాంతమైన అందమైన ముఖంతో ప్రేక్షకులను పలకరిస్తున్నట్లుగా అత్యంత నైపుణ్యంతో వార్తలు అందించేవారామె. ఆమె గొంతుకకు మాతమ్రేగాక ధరించే దుస్తులకు కూడా అభిమానులు ఉండేవారట. దూరదర్శన్‌కు ఆమె దుస్తుల గురించి వందలాది అబిమానుల లేఖలు వచ్చేవట. ఆమె ధరించే గుజరాతీ చీరలను హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుమణులు కూడా కాపీ చేసేవారట. అంతేగాదు ఆమె చీర కట్టు తీరు కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది, పైగా ఆ క్రెడిట్‌ని తన తల్లికే ఇచ్చేవారట ఆమె. నిజానికి టెలిప్రాంప్టర్లు లేని యుగం, న్యూస్ రీడర్లు పూర్తిగా వారి జ్ఞాపకశక్తిపై ఆధారపడవలసి వచ్చింది. దాంతో సరళ తరుచుగా ఇంటర్వ్యూలలో ఇలా అనేవారట. ఇది అపారమైన బాధ్యతతో కూడిన పని అని, దీన్ని బాగా చేయడానికి ఎంతో కొంత పరిణతి ఉండాలని చెప్పేవారట.

Post a Comment

0 Comments

Close Menu