Ad Code

జగిత్యాల ఎమ్మెల్యే కుమార్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన స్పీకర్‌


తెలంగాణలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సంజయ్‌ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని స్పీకర్‌ తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సంజయ్‌పై అనర్హత కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇక, పార్టీ ఫిరాయిపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సంజయ్‌ సహా ఎనిమిదిమందిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌ కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్ల విచారణను 19కి వాయిదా వేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేకు కూడా క్లిన్‌చిట్‌ ఇచ్చేశారు. స్పీకర్‌ ఇచ్చిన తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే స్పందిస్తూ 'నేను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేనే. ఆ పార్టీలోనే గెలిచా అని అఫిడవిట్‌ ఇచ్చా. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టి, విప్‌ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తా. నేనెప్పుడూ ఆ పార్టీని, అధిష్టానాన్ని విమర్శించలేదు. స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకత్వం నాకు దూరంగా ఉంది. నాది ఎలక్షన్‌ కోసం కాదు.. అభివృద్ధి కోసం ఆరాటం. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా' అని స్పష్టం చేశారు. నా జీతం నుంచి నెలకు రూ. 5 వేలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కట్‌ అవుతున్నాయి. నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్‌ ఇచ్చానని సంజయ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ లో పనిచేస్తూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని కడియం శ్రీహరి చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ వ్యాఖ్యానించారు. కడియం.. నీతులు చెప్పడం ఆపు. నువ్వు కాంగ్రెస్‌లో చేరావని స్పీకర్‌ ముందు అంగీకరించు. దిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాలయాపన చేసి అనర్హత నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఆధారాలు లేవని ఎనిమిది మందికి స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు' అని వివేకానంద తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu