Ad Code

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : చట్టం తన పని తాను చేస్తుంది


హైదరాబాద్ లో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పుచేసి మాపైనే అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఎవరి మీదా కక్ష సాధింపు ఆలోచన లేదని శ్రీధర్‌ బాబు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు, ఆటంకవాదుల ఫోన్లను ట్యాప్‌ చేస్తారని, కానీ ఇక్కడ నాయకులు, జడ్జిలు, వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్‌ చేశారని చెప్పారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఎవరు చేశారు, ఎందుకు చేశారో తేల్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ధర్మపురి అర్వింద్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారని ప్రస్తావించారు. వారి కుటుంబ సభ్యుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ఈ నీచానికి ఎవరు ఒడిగట్టారో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. దుశ్చర్యకు పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu