తెలంగాణలోని కోదాడ మండలం గణపవరం వద్ద ఆటోను కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం తొగర్రాయి గ్రామం నుంచి మల్లారెడ్డి గూడెం వైపు మిరపకాయ కూలీలతో వెళ్తున్న ఆటోకు ఎదురుగా కందిబండ వైపు నుంచి వస్తున్న కాలేజీ బస్సు గణపవరం గ్రామం వైపు ఒక్కసారిగా మలుపు తిప్పింది. అకస్మాత్తుగా బస్సు మలుపు తిప్పడంతో ఆటో డ్రైవర్కు అదుపు చేయడం సాధ్యం కాక ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీకొన్న ప్రభావంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు గాల్లోకి ఎగిరిపడి రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారి వివరాలు.. ప్రమాదంలో విజయలక్ష్మి, సావిత్రమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రేణుక, సుకన్య, నాగమణి, రాంబాబు, వసంత సురేష్, ఉపేందర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారంతా ఒకే గ్రామానికి చెందినవారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కోదాడ రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద స్థలంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
0 Comments