మేడారం మహా జాతరలో జాతర హుండీల లెక్కింపును హన్మకొండలోని టిటిడి కళ్యాణమండపంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లెక్కింపు ప్రక్రియ స్పెషల్ ఆఫీసర్ ఈ కృష్ణ ప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామిలు దగ్గరుండి ఈ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మేడారం జాతరకు సంబంధించి మొత్తం 828 హుండీలకు గాను, 125 హుండీలను తెరిచి నిన్న లెక్కించారు. ఈ 125 హుండీల ద్వారా రెండు కోట్ల 49 లక్షల 65 వేల రూపాయల ఆదాయం తొలి రోజు దేవాదాయ శాఖకు సమకూరింది. దాదాపు పది రోజులపాటు మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇందులో అమ్మవారి హుండీలో డబ్బులతో పాటు బంగారం, వెండి వంటి ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. విదేశీ కరెన్సీ, గతంలో మార్చుకోలేకపోయిన పాత కరెన్సీ ఇలా ప్రతీది మేడారం జాతర హుండీలలో దర్శనమిస్తున్నాయి. హుండీల లెక్కింపు కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు 200 మందితో పాటు సేవా సమితి నుంచి 300 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ మేడారం జాతరకు వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం ఆదాయాన్ని పూజారులకు ఇస్తారు. గత జాతరలో 13 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం అంతకు మించిన ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జాతర హుండీలలో అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకున్న భక్తులు డబ్బులతో పాటు కొన్ని లేఖలు కూడా వేయడం, లెక్కించే సిబ్బందిని షాక్ కు గురిచేస్తుంది. జాతర హుండీల లెక్కింపు లో కొన్ని ప్రేమలేఖలు రావడం, తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలను హుండీలో వేయడం కనిపించింది. అంతేకాదు మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను కూడా హుండీలలో వేశారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని ఉద్దేశించి రాసి మేడారం హుండీలలో వేశారు.
0 Comments