హైదరాబాద్ కూకట్పల్లిలోని వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు అయింది. ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేశారని బాధితులు రోడ్డెక్కారు. సుమారు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా వివిధ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ చెప్పిన మాట ప్రకారం ప్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ యజమాని అజయ్తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కూకట్పల్లి వై-జంక్షన్-మూసాపేట సమీపంలో 2018లో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ బుకింగ్ చేపట్టింది. బాలానగర్ మెట్రో స్టేషన్కు నేరుగా యాక్సెస్ ఉందని కస్టమర్లను ఆకర్షించింది. మొత్తం ప్రాజెక్ట్లో సుమారు 500 మంది నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేసింది. ఈ క్రమంలో 15 అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్లాట్ అప్పగించడంలో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ఆలస్యం చేయడంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా సుజాత అనే కస్టమర్ నుంచి 90 శాతం డబ్బులు వసూలు చేసిన తర్వాత మరో వ్యక్తి పేరుతో నకిలీ అమ్మకపు ఒప్పందం చేయడంపైనా బాధితులు మండిపడుతున్నారు. అదే ఫ్లాట్ను నకిలీ తనఖా పెట్టి ఎస్బీఐ హోమ్ లోన్స్ ద్వారా కోటి 27లక్షల రుణం తీసుకున్నారు. ఇందులో బిల్డర్, నకిలీ వ్యక్తి, బ్యాంక్ అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. మోసం బయటపడడంతో ప్లాట్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా అమలు చేయకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఇప్పటికే వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో సుమారు వందమందికి పైగా ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments