Ad Code

బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహమాన్


బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, పార్టీ తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీఎన్పీ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు దక్షిణాసియా దేశాల అధినేతలను ఆహ్వానించాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఒకవేళ మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే, గత కొంతకాలంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధతకు తెరపడే అవకాశం ఉంది. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల భారీ నిరసనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలనను పర్యవేక్షించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-బంగ్లా సంబంధాల్లో కొంత ఒడుదొడుకులు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కొలువుదీరుతుండటంతో సంబంధాలు తిరిగి బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఎన్పీ విజయంపై ప్రధాని మోడీఇప్పటికే సానుకూలంగా స్పందించారు. తారిఖ్ రెహమాన్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. "రెహమాన్ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం" అని మోదీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బీఎన్పీ, భారత ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu