Ad Code

తల్లి, కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి !


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, వడ్లూరు గ్రామంలో ఓ వ్యక్తి తల్లి, కుమారుడిని హతమార్చి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జక్కని సత్యనారాయణ స్థానికంగా హోటల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వివిధ కారణాలతో రెండు నెలల కిందట హోటల్‌ను మూసివేశాడు. తల్లి యశోద (80), భార్య దేవేంద్ర, రెండో కుమారుడు సురేశ్‌ (36)తో కలసి సత్యనారాయణ గ్రామంలో నివసిస్తున్నాడు. కాగా, దేవేంద్ర శనివారం సిరిసిల్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఓ గదిలో యశోద, సురేశ్‌ తలలపై బలమైన గాయాలతో శవాలుగా పడి ఉండటాన్ని గుర్తించింది. మరో గదిలో భర్త సత్యనారాయణ ఉరి వేసుకుని మరణించాడు. సత్యనారాయణకు నరేశ్, సురేశ్, రాజు అనే ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు కరీంనగర్‌లో, చిన్న కుమారుడు సిరిసిల్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సురేశ్‌కు పెళ్లి సంబంధాలు కుదరక ఇంట్లో స్వల్పంగా గొడవలు జరిగాయి. ఆత్మహత్యకు పాల్పడ్డ సత్యనారాయణ వద్ద సూసైడ్‌ నోట్‌ లభించినట్లు సమాచారం. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సౌజన్య తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu