ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండలంలో ఉపాధి పనుల అమలులో అవకతవకలు జరిగినట్లు లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో పనులు పూర్తిగా నిర్వహించకుండానే, మొక్కలు నాటకుండానే బిల్లులు రూపొందించి ప్రభుత్వ నిధులు వినియోగించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో ఎంప్లాయ్ మెంట్ కోఆర్డినేటర్ (ఈసీ)గా పనిచేసి ప్రస్తుతం మార్కాపురం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బెల్లంకొండ కిషోర్ కుమార్, అలాగే త్రిపురాంతకం, తర్లుపాడు మండలాల్లో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు నారాయణ, శివారెడ్డి లను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన మొత్తాన్ని వారం రోజుల్లోగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
0 Comments