ఉత్తరప్రదేశ్లోని మీరట్, ముజఫర్నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో సందడిగా ఉండే మార్కెట్లో అతిదారుణంగా ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపాడు. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్ సైకిల్పై మార్కెట్ గుండా వెళుతుండగా వెనుక నుండి వచ్చిన ప్రదీప్ నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు, విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు. పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది. అప్పటి నుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేదంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు. బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు.
0 Comments