వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్ ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఫ్లోరిడాకు వెళ్తున్న క్రమంలో ఎయిర్ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''మేము ఇప్పటికే వెనిజులాతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై వెనిజులా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం'' అని ట్రంప్ తెలిపారు. అలాగే వెనిజులా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. దీనిపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందని, తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ నేత నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుంచి లక్షల బ్యారెల్ల చమురు దిగుమతి చేసుకునేది. ఒనానొక దశ వచ్చేసరికి ఆ దేశం మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వరకు భారతదేశం వాటా కలిగి ఉండేది. అయితే, 2010 చివర్లో అమెరికా వెనిజులాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో.. ద్వితీయ శ్రేణి ఆంక్షల భయంతో భారత్కు చెందిన కంపెనీలు కొనుగోళ్లను తగ్గించాయి, ఫలితంగా వెనిజులా చమురు దిగుమతులు గణనీయంగా పడిపోయాయి.
0 Comments