బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. వీటి రేట్లు భారీగా తగ్గడం వరుసగా ఇది మూడోరోజు. మున్ముందు ఇంకా తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. శనివారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం బంగారం ధరల్లో ఆరు శాతం మేర క్షీణత కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో కిందటి రోజు సాయంత్రం 1,52,345 రూపాయల వద్ద బంగారం ట్రేడింగ్ ముగిసింది. ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గుదలతో 1,43,205 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో నూ ఇదే తగ్గుదల కనిపించింది. కామెక్స్ లో స్పాట్ బంగారం ధర ఒక ఔన్సుకు 4,879 డాలర్లు పలికింది. కిందటి రోజుతో పోల్చుకుంటే ఇది 8.25 శాతం తగ్గింది. శనివారం దీని ధర 4,945.26 డాలర్లు. కాగా నేడు 4,879 డాలర్లకు క్షీణించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లల్లో మూడు రోజులుగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు బంగారం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. అయోమయ స్థితిలోకి నెట్టాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,38,600 కాగా, 22 క్యారెట్లు రూ. 1,27,050కి తగ్గింది. ఢిల్లీ, జైపూర్లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,26,950, 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,250గా నమోదైంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో సహా పలు నగరాల్లో 22 క్యారెట్లు రూ. 1,27,050, 24 క్యారెట్లు రూ. 1,38,600కు చేరుకున్నాయి. స్పాట్ మార్కెట్లో వెండి ధరలు కిలోకు రూ. 2,65,600కు చేరింది. గత వారం ₹4 లక్షల రికార్డు స్థాయిని తాకిన తర్వాత, శుక్రవారం ధరలు 27% పతనమై ₹2,90,000కి చేరుకున్నాయి. 1980ల తర్వాత ఇదే అతిపెద్ద ఒకరోజు పతనంగా నిలిచింది. గురువారం సాయంత్రం ₹3,30,000 వరకు పడిపోయి, ఆ తర్వాత కొంత కోలుకోవడం గమనార్హం.
0 Comments