మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ మాట్లాడుతూ ఇందులో ఎలాంటి కుట్రా లేదని, ఇది ఒక ప్రమాదం మాత్రమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'ఇందులో ఎలాంటి కుట్ర లేదు. ఇది పూర్తిగా ప్రమాదమే. అజిత్ పవార్ మరణం మహారాష్ట్రకు తీరని లోటు. ఒక సమర్ధుడైన నేత ఈరోజు మనలను వదిలి వెళ్లిపోయారు. ఒక గొప్ప వ్యక్తిని మహారాష్ట్ర కోల్పోయింది. ఆయన లేనిలోటు ఎప్పటికీ భర్తీ కాదు' అని శరద్ పవార్ అన్నారు. ఏదీ మన చేతిలో లేదని, తాను ఏమీ చేయలేని నిస్సహాయుడినని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఘటనల వెనుక రాజకీయాలు ఉండవని, ఈ ఘటనలో ఎలాంటి కుట్ర లేదని, కేవలం ప్రమాదమేనని చెప్పారు. తమకే కాకుండా మహారాష్ట్ర ప్రజలందరికీ అజిత్ మరణం తీరని లోటని అన్నారు. 'దయజేసి ఈ ఘటనలోకి రాజకీయాలను లాగొద్దు, అదే నేను చెప్పదలచుకున్నాను' అని పవార్ విజ్ఞప్తి చేశారు.
0 Comments