Ad Code

పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం అదుపు తప్పి పల్టీ : ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు


తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి సమీపంలో మంగళవారం ఉదయం నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏఎస్ఓగా పనిచేస్తున్న కల్పన అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కల్పన మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో రావులపల్లి హెడ్మాస్టర్‌తో పాటు మరో హెడ్మాస్టర్ తులసికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కల్పన తన అన్న ప్రవీణ్ కుమార్ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం  అత్యంత హృదయ విదారకం. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కారు టైర్ అకస్మాత్తుగా పేలిపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే సీట్ బెల్ట్ ధరించకపోవడం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం కూడా ప్రమాదానికి దోహదపడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై లోతైన విచారణ జరిపి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu