ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6వ ఎడిషన్కు లడఖ్లోని నవాంగ్ డోర్జన్ స్టోబ్డాన్ స్టేడియం వేదికైంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ వరుసగా మూడవసారి ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంప్రదాయ సంగీతం, నృత్య రూపకాలతో ప్రారంభోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఆర్మీ ఎలెవన్, యూటీ లడఖ్ జట్ల మధ్య జరిగిన ప్రదర్శన ఐస్ హాకీ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లడఖ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 'ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో భారతదేశంలో శీతాకాల క్రీడల భవిష్యత్తు హిమాలయాల నుంచి మొదలవుతోంది. వింటర్ గేమ్స్ ఇప్పుడు భారత క్రీడా వ్యవస్థలో అంతర్భాగమయ్యాయి. ఈసారి క్రీడలను లడఖ్లో ఐస్ స్పోర్ట్స్, గుల్మార్గ్లో స్నో స్పోర్ట్స్ నిర్వహించడం ద్వారా అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం లభిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
0 Comments