మహారాష్ట్రలో ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం ఆమె డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కీలక పరిణామంపై ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ సునేత్రా పవార్కు పదవి ఇవ్వాలనే నిర్ణయం పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిందని, ఇందులో పవార్ కుటుంబాన్ని ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. "శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందని మాకు మీడియా ద్వారానే తెలిసింది. ప్రమాణ స్వీకారం గురించి మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు, దాని గురించి నాకేమీ తెలియదు" అని శరద్ పవార్ స్పష్టంగా పేర్కొన్నారు. అజిత్ పవార్ వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియలో మిమ్మల్ని పక్కన పెట్టారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు "నాకు తెలియదు" అని ఆయన పొడిపొడిగా సమాధానం ఇచ్చి దాటవేశారు. శరద్ పవార్ కామెంట్స్ రాజకీయాలకు,కుటుంబానికి మధ్య ఉన్న స్పష్టమైన విభజనను సూచిస్తున్నాయి. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్తో విభేదించి, పార్టీని చీల్చి విడిగా వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య రాజకీయ పోరు తీవ్రంగా నడుస్తోంది. బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఏర్పడింది. ఆయన రాజకీయ వారసత్వాన్ని సునేత్రా పవార్కు అప్పగించడం ద్వారా పార్టీ పట్టును కాపాడుకోవాలని ఎన్సీపీ భావిస్తోంది.
0 Comments