రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రముఖ మత బోధకురాలైన సాధ్వి ప్రేమ్ బైసా, జనవరి 28న సాయంత్రం బోరానంద ఆశ్రమంలో అనుమానాస్పదంగా మరణించింది. తండ్రి, గురువైన వీరం నాథ్ మరో వ్యక్తి కలిసి జోధ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా జ్వరం, జలుబుతో ఆమె బాధపడుతున్నట్లు తండ్రి వీరం నాథ్ తెలిపారు. ఒక కంపౌండర్ను ఆశ్రమానికి పిలిపించినట్లు చెప్పారు. ఆ కంపౌండర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు డాక్టర్కు వివరించారు. కాగా, సాధ్వి ప్రేమ్ బైసా అప్పటికే మరణించినట్లు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ జైన్ నిర్ధారించారు. మృతదేహానికి పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నిరాకరించిన సాధ్వి తండ్రి ఆమె మృతదేహాన్ని తన కారులో ఆశ్రమానికి తీసుకెళ్లాడు. మరోవైపు సాధ్వి ప్రేమ్ బైసా మరణించిన సుమారు మూడు నాలుగు గంటల తర్వాత బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వచ్చింది. 'అగ్నిపరీక్ష'కు సిద్ధమయ్యా. నేను ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నా. నా మరణానంతరం అయినా నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా' అన్న వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సాధ్వి ప్రేమ్ బైసా గురించి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు బోరానంద ఆశ్రమానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎంజీహెచ్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం, మృతదేహాన్ని అప్పగించేందుకు నిరాకరించడం, ఆమె మరణం తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ రావడంపై పలు అనుమానాలున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మెడికల్ బోర్డు సమక్షంలో పోస్ట్మార్టం అవసరమని చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన కంపౌడర్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ సిబ్బంది బ్లాక్మెయిల్, పరువు నష్టం గురించి ఆరు నెలల కిందట సాధ్వి ఆరోపించడంపైనా దర్యాప్తు చేస్తామని అన్నారు. మరోవైపు ఆర్ఎల్పీ ఎంపీ, బలమైన జాట్ నేత హనుమాన్ బెనివాల్ కూడా సాధ్వి ప్రేమ్ బైసా మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మను డిమాండ్ చేశారు.
0 Comments