హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడిని భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 7 కోట్లను కొట్టేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నావంటూ ఆ వృద్ధుడికి ఫోన్ లు చేసి భయబ్రాంతులకు గురి చేశారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని, ఇక బతికినంత కాలం జైల్లోనే ఉండాలంటూ ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ వృద్ధుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతోపాటు పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేదు. వాళ్లు అడిగినంత ఇస్తూ ఏకంగా రూ. 7 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమాజిగూడకు చెందిన ఓ వృద్ధుడు (81) ఫోన్ కు గతేడాది అక్టోబర్ లో వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగా ఓ సైబర్ నేరగాడు మాట్లాడుతూ మీరు ముంబై నుంచి బ్యాంకాక్ కు పంపిన కొరియర్ లో ల్యాప్ టాప్, బట్టలు, ఐదు పాస్ పోర్టులు అలాగే డ్రగ్స్ ఉన్నాయని బెదిరించాడు. దీంతో వృద్ధుడు.. తాను ఎలాంటి కొరియర్ చేయలేదని ఫోన్ పెట్టేశాడు. కొద్ది నిమిషాలకే ముంబై పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ మరో కాల్ చేశారు. మీరు డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని భయపెట్టారు. ఈ క్రమంలో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు భయబ్రాంతులకు గురిచేశారు. అలా తొలుత రూ. 19 లక్షలకు పైగా దోచుకున్నారు. కొన్ని రోజులకు మరో సైబర్ దుండగుడు ఫోన్ చేసి సిగ్నల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని అన్నాడు. వృద్ధుడితో యాప్ ద్వారా మాట్లాడుతూ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్ లోని రూ.7 కోట్ల 12 లక్షలకుపైగా నగదును తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. నగదు లావాదేవీలు పూర్తిగా పరిశీలించాక తిరిగి జమ చేస్తామని నమ్మించారు. ఆ తర్వాత వృద్ధుడి ఫోన్ నుంచి సిగ్నల్ యాప్ ను తొలగించారు. కొద్దిరోజుల తరువాత మరోసారి ఫోన్ చేసి రూ. కోటిన్నర పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వృద్ధుడిని అనుమానం వచ్చింది. దాంతోపాటు డిజిటల్ అరెస్ట్ పై పేపర్ లో కథనాలు చదివి తాను మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
0 Comments