హైదరాబాద్ లోని మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జుబేర్ ఉస్మాని, ఖాన్లతీఫ్ఖాన్ బిల్డింగ్లో ఐపీసిస్ పేరుతో సీసీ కెమెరాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద 2020 నుంచి మార్కెటింగ్ మేనేజర్గా సయ్యద్ సలాఉద్దీన్ అహ్మద్ పనిచేస్తున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న డబ్బులో కొంత మొత్తం తన భార్య అఫ్షాన్ జబీన్తోపాటు ఇతర బంధువుల ఖాతాల్లోకి పంపేవాడు. ఈ డబ్బు సంస్థ ఖాతాలో జమ అయినట్లు రికార్డుల్లో నమోదు చేసేవాడు. ఇలా ఐదేళ్లలో మొత్తం రూ. 3 కోట్లు దారి మళ్లించి భార్య, బంధువుల ఖాతాల్లో జమ చేయించాడు. ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడటంతో తప్పును అంగీకరించి డబ్బు తిరిగి చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. మధ్యవర్తులతో మాట్లాడిస్తూ కాలయాపన చేసిన నిందితుడు భార్యతో కలిసి పరారయ్యాడు. అంతేకాకుండా అదే సంస్థలో పనిచేసి మానేసిన మాజీ ఉద్యోగి సయ్యద్ జలాల్తో కలిసి డబ్బు ఇవ్వనంటూ దబాయించడంతో పాటు కార్యాలయాన్ని తగల బెడతామంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో సంస్థ యజమాని జుబేర్ నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments