తెలంగాణ సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, జనవరి 13-14 తేదీల్లో గచ్చిబౌలిలో డ్రోన్ షో నిర్వహిచబోతున్నామని చెప్పారు. ఈ కైట్ ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 40 మంది పాల్గొంటారని, డ్రోన్ షో లో భాగంగా అత్యాధునిక ఎల్ఈడీ డ్రోన్లతో గగనతల విన్యాసాలు ఉంటాయని, తెలంగాణ పర్యాటక ప్రాంతాల డిజిటల్ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. పర్యాటక రంగంలో తెలంగాణ వెనుకబడి ఉందని రాష్ట్రంలో కనీస అవసరాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని మంత్రి చెప్పారు. టూరిజంలో ప్రపంచ దేశాలను ఆకర్షించాలన్నారు. పెట్టుబడులు ఆకర్షించి వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యాటక, మెడికల్, ఎకో, టెంపుల్, టూరిజంలో పెట్టుబడుల ఆకర్షిస్తామని చెప్పారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రకృతి సంపదను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపై ఆధారపడ్డాయని తెలంగాణ మాత్రం అడుగున ఉన్నామన్నారు. రాష్ట్రంలో గొప్ప గొప్ప కట్టడాలను పర్యాటకులకు తెలియజేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
0 Comments