తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ''కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి'' అని తనను కలిసి బీఆర్ఎస్ ఎంపీలకు మోడీ చెప్పారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ధీకొండ దామోదర్రావు.. శుక్రవారం పార్లమెంట్లో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల వరకూ నిర్మిస్తున్న నేషనల్ హైవే 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకూ విస్తరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోడీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్థి అవుతుందని తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి, వేములవాడ మీదుగా కోరుట్లలో ఎన్హెచ్-63ని కలిపేలా విస్తరించాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
0 Comments