ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా చందౌసికి చెందిన రాహుల్ (40) అనే వ్యక్తి షూ వ్యాపారం చేసేవాడు. డిసెంబర్ 15న చందౌసి పరిధిలోని పత్రౌవా రోడ్డు సమీపంలో పాలిథిన్ కవర్లలో కుక్కబడిన ఓ వ్యక్తి శరీర భాగాలు పోలీసులకు లభించాయి. నిందితులు మృతదేహాన్ని చాలా క్రూరంగా ముక్కలు చేశారు. తల, చేతులు, కాళ్లు నరికేయడంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే ఒక చేతిపై రాహుల్ అని పేరు పచ్చబొట్టు ఉండటంతో మృతుడిని గుర్తించారు. రాహుల్ అదృశ్యమయ్యాడంటూ నవంబర్ 18న అతని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమెను విచారిస్తున్నప్పుడు ఆమె చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం కలిగింది. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా రూబీకి గౌరవ్ అనే వ్యక్తితో పాటు మరికొందరితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తేలింది. రాహుల్, రూబీలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. విచారణలో వీరి కుమార్తె చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. "అమ్మ, నాన్న ఎప్పుడూ గొడవ పడేవారు. ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి తరచుగా వచ్చేవారు, నా కోసం చాక్లెట్లు తెచ్చేవారు. విచారణలో ఆ చిన్నారి కన్నీరు మున్నీరవుతూ తన తండ్రి మరణానికి తన తల్లే కారణమని, నిందితులందరినీ ఉరి తీయండి" అని పోలీసులను కోరింది. పోలీసులు రాహుల్ ఇంట్లో సోదాలు చేయగా, రక్తం మరకలు ఉన్న మంచం కోడు, స్కూటర్, ఐరన్ రాడ్, ఎలక్ట్రిక్ హీటర్ వంటి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే హత్య చేసి ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి బయట పారేసినట్లు ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. అయితే రాహుల్ తల మాత్రం ఇంకా లభించలేదు. దాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మీరట్ ముస్కాన్ కేసు తరహాలోనే ఈ హత్యను పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
0 Comments