పేద విద్యార్థిని వైద్య విద్య కోసం తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు రుణం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి ఆ విద్యార్ధిని పీజీ విద్య పూర్తి చేసేందుకు మద్దతుగా నిలిచారు. ఏదైనా ఆస్తి చూపిస్తేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పటంతో హరీష్ ముందుకు వచ్చారు. సిద్దిపేటలోని తన ఇంటికి తాకట్టు పెట్టి రూ 20 లక్షలు విద్యార్ధిని చదువు కోసం విద్యా రుణం ఇప్పించారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయలు కూడా అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం పెద్ద కూతురు మమతకు ఇటీవల పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లకు రూ. 22.50 లక్షలు కట్టాల్సి ఉంది. ఈ నెల 18 చివరి తేదీ. ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. బ్యాంకులో లోన్ కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే కానీ రుణం మంజూరు చేయలేమని బ్యాంకర్స్ చెప్పారు. అలాంటి సమయంలోనే తన బిడ్డల ఎంబీబీఎస్ చదువు కోసం సాయం చేసిన హరీశ్రావును కలిసి, తన పరిస్థితిని వివరించారు. దీంతోసాయం చేయాలని భావించిన హరీశ్రావు మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేశారు. గతంలో మమత ఎంబీబీఎస్ చదువు కోసం హరీశ్రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె ముగ్గురు తోబుట్టువుల ఎంబీబీఎస్ చదువు కోసం కూడా హరీశ్రావునే సాయం చేసారు. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించటం పైన హరీష్ కు విద్యార్ధిని మమత ధన్యవాదాలు చెప్పారు. కాగా, మమత ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. హరీష్ తో ఎలాంటి బంధుత్వం లేకపోయినా సాయం చేసేందుకు ముందుకు రావటం పైన కుటుంబం మొత్తం ధన్యవాదాలు తెలిపింది.
0 Comments