Ad Code

ఐటీ కంపెనీ మేనేజర్‌పై సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త గ్యాంగ్ రేప్ : డ్యాష్‌క్యామ్ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో ఒక కంపెనీ సీఈఓ, మరో ఉన్నతాధికారి కలిసి ఒక మహిళా మేనేజర్‌పై నడుస్తున్న కారులోనే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ క్రూరత్వానికి ఒక మహిళా అధికారి కూడా సహకరించడం గమనార్హం. బాధితురాలు ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం డిసెంబర్ 20వ తేదీ రాత్రి కంపెనీ సీఈఓ పుట్టినరోజు, న్యూ ఇయర్ వేడుకలు ఒక హోటల్‌లో జరిగాయి. రాత్రి 9 గంటలకు పార్టీకి వెళ్లిన బాధితురాలు, తెల్లవారుజామున 1:30 గంటల వరకు అక్కడే ఉంది. పార్టీలో మద్యం సేవించడం వల్ల ఆమె ఆరోగ్యం కాస్త క్షీణించింది. బాధితురాలి పరిస్థితి చూసి కొందరు ఆమెను ఇంటి దగ్గర వదిలిపెడతామని ముందుకొచ్చారు. అయితే కంపెనీకి చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ తాను స్వయంగా ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికి బాధితురాలిని ఆమె కారులోనే ఎక్కించుకుంది. ఆ కారులో సదరు మహిళా అధికారి భర్త, కంపెనీ సీఈఓ కూడా ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం దారిలో నిందితులు ఒక షాపు దగ్గర ఆగి ఆమెకు మత్తు పదార్థం కలిపిన పానీయాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నడుస్తున్న కారులోనే సీఈవో, ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు మధ్యలో స్పృహలోకి వచ్చినప్పుడు సీఈవో తనపై అఘాయిత్యం చేస్తున్నట్లు గుర్తించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిందితులు బాధితురాలిని ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లారు. పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు తన శరీరానికి అయిన గాయాలు, ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావం చూసి దిగ్భ్రాంతికి గురైంది. తన వంటిపై ఉన్న నగలు, దుస్తులు కూడా మాయమైనట్లు ఆమె గుర్తించింది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం కారులోని డ్యాష్‌క్యామ్. కారులో అమర్చిన కెమెరాలో నిందితుల మాటలు, వారి అకృత్యాలు ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు ఆ సాక్ష్యాలతో సహా పోలీసులను ఆశ్రయించింది. సుఖేర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ఏఎస్పీ మాధురి వర్మకు అప్పగించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డ్యాష్‌క్యామ్ ఫుటేజీని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణకు పంపారు.

Post a Comment

0 Comments

Close Menu