ధనియాల నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలో ఉన్న మురికిని కడిగేసే ఒక సహజ క్లీనర్గా పనిచేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు ‘త్రిదోష హారిణి’. అంటే ఇవి వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో అధిక వేడిని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో దీనికి సాటిలేదు. ధనియాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి సహజ సిద్ధమైన ‘డైయూరిటిక్’గా పనిచేసి, రక్తంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపి శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ధనియాల నీరు ఒక వరప్రసాదం. ఇది జఠరాగ్నిని ప్రేరేపించి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. రక్తంలోని టాక్సిన్స్ క్లియర్ అవ్వడం వల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల రక్షణకు తోడ్పడతాయి. చాలామంది ధనియాల పొడి వాడుతుంటారు, కానీ గింజలు వాడటం ఉత్తమం. రెండు టీస్పూన్ల ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం సగం అయ్యే వరకు ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి, పరగడుపున నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి.
0 Comments