జైపూర్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముందస్తు హెచ్చరికలు పంపాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అభిషేక్ శర్మ.. ఆదివారం ఉదయం జైపూర్ శివార్లలోని క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. బౌలర్లపై 'రుద్ర తాండవం' చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ హిట్టింగ్పైనే దృష్టి సారించాడు. సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అభిషేక్ శర్మ.. ఒక్క బంతిని కూడా డిఫెండ్ చేయలేదు. ఆఫ్-స్పిన్, లెగ్-స్పిన్ అని తేడా లేకుండా బౌలర్లు వేసిన బంతులని స్టాండ్స్లోకి పంపాడు. అభిషేక్ శర్మ సిక్సర్ల ధాటికి కనీసం ఐదు బంతులు మైదానానికి ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్స్లో పడ్డాయి. ముఖ్యంగా 'ఎక్స్ట్రా కవర్' దిశగా అభిషేక్ ఆడిన ఇన్ సైడ్-ఔట్ షాట్లు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రాక్టీస్ మొదలైన 10 నిమిషాలకే అభిషేక్ తన హిట్టింగ్ మొదలుపెట్టాడు. సహచర ఆటగాడు గౌరవ్ చౌదరిని "ఫీల్డింగ్ సెటప్ ఎలా ఉంది?" అని ఒక ఊహాత్మక ప్రశ్న అడిగి, దానికి అనుగుణంగా బంతిని స్టాండ్కు తరలించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ గంట సేపట్లో ఆయన కేవలం 3 లేదా 4 సార్లు మాత్రమే ఔట్ అయ్యారు. అది కూడా డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించినప్పుడే కావడం గమనార్హం.
0 Comments