ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ భవనం టెర్రా డ్రోన్ ఇండోనేషియా కార్యాలయం. ఈ సంస్థ మైనింగ్ నుంచి వ్యవసాయ రంగం వరకు వివిధ క్లయింట్లకు ఏరియల్ సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్లను అందిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసత్యో పూర్ణోమో కొండ్రో విలేకరులతో మాట్లాడుతూ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని, భవనం లోపల మరింత మంది బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం మధ్యాహ్నం మొదటగా మొదటి అంతస్తులో మొదలై, ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించిందని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా.. మరికొందరు ఆఫీసు నుంచి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 20కి చేరుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం, మేము బాధితులను తరలించడం, మంటలు చల్లబరిచే పనులపై దృష్టి సారించామని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా ఫుటేజీలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్న వ్యక్తులను బయటకు తరలించడానికి ప్రయత్నించడం కనిపించింది. కొంతమంది అగ్నిమాపక సిబ్బంది భవనం నుండి బాడీ బ్యాగ్లను మోసుకెళ్లడం కూడా వీడియోలో ఉంది. అలాగే భవనం ఎత్తైన అంతస్తుల నుండి కొందరు కార్మికులు పోర్టబుల్ నిచ్చెనలను ఉపయోగించి తప్పించుకోవడం కనిపించింది.
0 Comments