తెలంగాణాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 2017-18 నుంచి 2023-24 వరకు మహిళా శ్రామికశక్తి 22 శాతం నుంచి 40.3 శాతంకు గణనీయంగా పెరుగుదల నమోదు చేసిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళా శ్రామికశక్తి 52.7 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే అధికమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహిళా స్టార్టప్స్ను గ్లోబల్ ఎంటర్ప్రైజెస్గా తీర్చిదిద్దేందుకు 'వీ హబ్ 2.0' రూపకల్పన చేస్తున్నామన్నారు. స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటార్షిప్ ఆల్ ఇన్ వన్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధే సమాజ ప్రగతికి మార్గం చూపుతుందని ఈ సందర్బంగా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి పేర్కొన్నారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
0 Comments