Ad Code

జవాన్ హత్యకు దారితీసిన బ్లాంకెట్‌, బెడ్‌షీట్‌ వివాదం !


గుజరాత్‌లోని సబర్మతికి చెందిన ఆర్మీ జవాన్‌ జిగార్‌ చౌధురి ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 2న సెలవుల కోసం ఫిరోజ్‌పూర్‌ స్టేషన్‌ నుండి జమ్ముతావి-సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కారు. స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, బీ4 ఏసీ కోచ్‌ అటెండెంట్‌ వద్ద బ్లాంకెట్‌, బెడ్‌షీట్‌ ఇవ్వమని కోరారు. అయితే, నిబంధనల ప్రకారం స్లీపర్‌ కోచ్‌ ప్రయాణికులకు ఈ సదుపాయం ఉండదని అటెండెంట్‌ చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై, అది క్రమంగా ఘర్షణగా మారింది. దాడి సమయంలో కోచ్‌ అటెండెంట్‌ జుబైర్‌ మిమన్‌ తన వద్ద ఉన్న కత్తితో జిగార్‌ చౌధురిపై దాడి చేశాడు. దాంతో ఆర్మీ జవాన్‌ అక్కడికక్కడే మరణించాడు. రైలు బికనీర్‌ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే టీటీఈ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జుబైర్‌ను కాంట్రాక్టర్‌ ద్వారా తాత్కాలికంగా నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. సహ్యద్రి రైట్స్‌ ఫోరమ్‌ అనే ఎన్జీఓ చేసిన ఫిర్యాదుపై కమిషన్‌ రైల్వే బోర్డ్‌ ఛైర్మన్‌, ఆర్పీఎఫ్‌ డీజీలకు నోటీసులు జారీ చేసింది. కదులుతున్న రైలులో సైనికుడి హత్య తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. కమిషన్‌ నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, నిందితుడి నియామక ప్రక్రియ, అర్హతలు, శిక్షణ, పోలీసు వెరిఫికేషన్‌ వంటి పత్రాలను సమర్పించాలని రైల్వే అధికారులను కోరింది. రెండు వారాల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రైల్వే బోర్డు, ఆర్పీఎఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu