భారీ వర్షాలతో శ్రీలంక అతాలకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు ముంచెత్తడంతో సుమారు 31 మంది మరణించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. కొలంబోకు తూర్పున 300 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియాలో 18 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. ఇవే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరో 14మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. పర్వతప్రాంతాలను రాళ్లు, బురద మరియు చెట్లు పట్టాలపై పడటంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేశామని ప్రకటించారు. వర్షాలు, ప్రతికూల వాతావరణంతో సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది.
0 Comments