తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల (28) రౌడీ షీటర్ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నిన్న సుశీల మరో మహిళతో కలిసి పత్తి తీసేందుకు అమ్మపాలెం గ్రామానికి వెళ్లింది. రౌడీషీటర్ ధరావత్ వినయ్ పొలంలో పనిచేస్తున్నసుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. అందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో వినయ్ బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వినయ్ దాడి చేయడంతోనే తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వినయ్ పరారీలో ఉన్నాడు. నిందితుడు ధరావత్ వినయ్ పై నెల రోజుల క్రితమే రౌడీ షీట్ తెరిచినట్లు ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మరోవైపు సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఒంటిపై గాయాలున్నాయని, పోస్ట్ మార్టం రిపోర్టులో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం సర్వజనాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, ఎస్సైలు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
0 Comments