అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో చిక్కడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని, దీంతో ఆసియన్ సదస్సుకు గైర్హాజరు అవుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడం ఒకటైతే, ఆపరేషన్ సిందూర్ను తాను నిలిపివేసినట్లు 53సార్లు ప్రకటించిన, రష్యానుండి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని ఐదుసార్లు పేర్కొన్న అధ్యక్షుడు ట్రంప్తో కలిసిమెలిసి తిరగడం ప్రధాని మోడీకి చాలా ప్రమాదకరం అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ తెలిపారు. ఆసియన్ సదస్సుకు ప్రధాని వర్చువల్గా హాజరుకానున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో చర్చలు జరపనున్న సంగతి తెలిసిందే. ''ప్రధాని ఆసియన్ సదస్సు కోసం మలేషియా వెళ్తారా లేదా, వస్తారా'' అని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో చర్చ నడుస్తోందని జైరాం రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధాని వెళ్లరని ఇప్పుడు కచ్చితంగా నిర్థారణైందని అన్నారు. ప్రపంచ నేతలను కౌగిలించుకుని ఫోటోలు తీయడానికి లేదా తనను తాను విశ్వ గురువుగా చెప్పుకోవడానికి మోడీ చాలా అవకాశాలను కోల్పోవడమే దీనర్థమని పేర్కొన్నారు. ట్రంప్ కూడా సదస్సులో ఉండటమే ప్రధాని మోడీ గైర్హాజరుకావడానికి కారణం. కొన్ని వారాల క్రితం ఈజిప్టులో జరిగిన గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం అందిందని, అయితే ఈ కారణంగానే ప్రధాని మోడీ తిరస్కరించారని అన్నారు. ప్రధాని మోడీ పాత తరం నాటి బాలివుడ్ సాంగ్ 'బచ్కే రెహనా రె బాబా' (జాగ్రత్తగా ఉండు మిత్రమా) ను గుర్తు చేసుకుంటూ ఉండవచ్చని ఎద్దేవా చేశారు.
0 Comments