Ad Code

వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసుల్ని కర్నాటక హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు !


దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేసులను.. కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సంస్థలు వివిధ కోర్టుల్లో కేసులు దాఖలు చేశాయి. అయితే సీసీఐ వేసిన పిటీషన్ ఆధారంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ-కామర్స్ సంస్థల కేసులను కర్నాటకకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయిన పిటీషన్ల కేసుల్లో విచారణ పూర్తి కాకుంటే, వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. అన్ని కేసులను కర్నాటక హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. సీసీఐ ఆరోపణలను సవాల్ చేస్తూ సుమారు 26 పిటీషన్లు వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్టలపై ఢిల్లీ వ్యాపార మహాసంఘం ఫిర్యాదులు చేసింది. దాని ఆధారంగా సీసీఐ విచారణ చేపట్టింది. అయితే సీసీఐ ఇచ్చిన నివేదికను తప్పుపడుతూ.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు వేర్వేరు కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేసింది.

Post a Comment

0 Comments

Close Menu