లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతంలో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎన్నడూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇటువంటి చట్ట విరుద్ధ, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల వాటికి చట్టబద్ధత కల్పించినట్లు కాదని పేర్కొంది. ఇదే అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ''చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన చూశాం. ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని ఎన్నడూ అంగీకరించం. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో భారత్కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇలా చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలతో చట్టబద్ధత లభించదు'' అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డామ్ను నిర్మించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ తొలిసారి స్పందించింది. దీనిపై పర్యవేక్షణ కొనసాగిస్తామని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది. ఈ అంశంలో పారదర్శకతతోపాటు దిగువ దేశాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
0 Comments