Ad Code

తమిళనాడులో చాపకింద నీరులా వ్యాపిస్తోన్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి !


మిళనాడులో స్క్రబ్‌ టైఫస్‌ అనే వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2024లో దాదాపు 5,000 కేసులు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు రాణిపేట, వేలూరు, తిరుపత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది.  ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్‌ టైఫస్‌  వస్తుంది. దీన్నే బుష్‌ టైఫస్‌ అని కూడా అంటారు. ముందుగా ఇది ఎలుకలకు సోకుతుంది. వాటిని కుట్టిన నల్లిపైకి ఆ సూక్ష్మజీవులు చేరతాయి. నల్లి మనల్ని కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ మనుషులను సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టినచోట మచ్చలతోపాటు దద్దుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. తమిళనాడులో మారుతున్న వాతావరణ పరిస్థితులు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. చర్మంపై దద్దుర్లు, చర్మంపై కాలిన లాంటి మచ్చలు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వణుకుతో కూడిన జ్వరం, ఆయాసం, కొన్ని సందర్భాల్లో రోగి కోమాలోకి వెళ్లిపోవడం దీని లక్షణాలు. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే న్యూమోనైటిస్‌, మెనింజైటిస్‌, గుండె సమస్యలు, అవయవాలు దెబ్బతినడం వంటి తీవ్ర లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మంపై కాలిన మచ్చలు, జ్వరం వంటి ప్రాథమిక లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తమవ్వాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. 'ఎలిసా' అనే రక్తపరీక్ష ద్వారా దీన్ని గుర్తించొచ్చు. పీసీఆర్‌ వంటి మాలిక్యులార్‌ టెస్ట్‌ ద్వారా కూడా శరీరంలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే వారిలో ఈ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉంది. పొదలు, గడ్డి, గుబురు చెట్లలో ఈ బ్యాక్టీరియా అధికంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. అలాంటి చోట్ల పనిచేసే రైతులు సహా ఇతరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధినిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నల్లి వంటి కీటకాలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అడవులు, చెట్లు, పొదల్లో కీటకాలు అధికంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు, వ్యాప్తి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. తొలి దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకుని, సురక్షితంగా బయటపడవచ్చు. ఐదు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. 

Post a Comment

0 Comments

Close Menu