బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనకు నమస్కరించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భుజం తట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలపై మరోసారి చర్చకు దారి తీసింది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోకి తిరిగి రాక కోసం నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. కాగా, బీహార్ కొత్త గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్కు ఆయన నమస్కరించారు. దీంతో తేజస్వీ యాదవ్ భుజాన్ని ఆయన తట్టారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత సీఎం నితీశ్ కుమార్ను మీడియా చుట్టుముట్టింది. ఇండియా కూటమిలోకి తిరిగి రావాలన్న లాలూ వ్యాఖ్యలపై స్పందించాలని కోరింది. దీనికి నవ్వుతూ 'ఏం చెబుతున్నారు?' అని అడిగారు. అలాగే చేతులు జోడించి సమాధానాన్ని దాటవేశారు. అయినప్పటికీ మీడియా వదిలిపెట్టలేదు. ఆయన ప్రభుత్వం పదవీకాలాన్ని పూర్తి చేస్తుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇంతలో కొత్త గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ జోక్యం చేసుకున్నారు. 'ఇలాంటి ప్రశ్నకు ఇది సందర్భం కాదు. ఇవాళ సంతోషకరమైన రోజు. మంచి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం' అని అన్నారు. అయితే బీహార్లో మరోసారి రాజకీయ సమీకరణలు మారవచ్చన్న ఊహాగానాల మధ్య తేజస్వీ యాదవ్ భుజం తట్టిన నితీశ్ కుమార్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments