ఢిల్లీ నుంచి లండన్ వరకు ఒక ప్రత్యేక బస్సు యాత్రను అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ అనే భారతీయ ట్రావెల్ కంపెనీ నిర్వహిస్తోంది. 65 రోజుల్లో 16,000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 18 దేశాల గుండా వెళ్లే ఈ యాత్ర ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది. పర్వతాలు, అడవులు, చారిత్రాత్మక నగరాలు, ఆధునిక మహానగరాలు ఇలా ఎన్నో విభిన్న ప్రదేశాలను ఈ యాత్రలో చూడవచ్చు. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ యాత్ర నేపాల్, చైనా, కిర్గస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, జార్జియా, టర్కీ, గ్రీస్, బల్గేరియా, సెర్బియా, హంగరీ, ఆస్ట్రియా, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, బెల్జియం మీదుగా ఫ్రాన్స్ చేరుకొని చివరకు లండన్లో ముగుస్తుంది. ప్రతి దేశంలో అక్కడి సంస్కృతి, చరిత్ర, ఆహారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రకృతి ప్రేమికులకు పర్వతాలు, అడవులు, అందమైన ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించవచ్చు. అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ అందిస్తున్న ఈ ప్రత్యేక యాత్రలో విలాసవంతమైన సౌకర్యాలు, థ్రిల్లింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ 65 రోజుల యాత్ర ఖర్చు సుమారు రూ.27 లక్షలు. ప్రయాణమంతా హాయిగా ఉండేందుకు కంఫర్టబుల్ సీటింగ్, బోర్ కొట్టకుండా ఆన్బోర్డ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ (టీవీ, సినిమాలు వంటివి), రుచికరమైన భోజనం, రాత్రిళ్లు బస చేయడానికి లగ్జరీ హోటళ్లు, నగరాలను చూసేందుకు గైడెడ్ టూర్లు, ఇంకా సరిహద్దులు దాటడానికి, వీసాల కోసం పూర్తి సహాయం అందిస్తారు. ఈ బస్సు యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది అనేక దేశాల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రత్యక్షంగా చూసే ఒక అద్భుత అవకాశం. చారిత్రాత్మక కట్టడాలు, స్థానిక వంటకాలు, కళలు, జీవన విధానం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అన్ని దేశాల ప్రత్యేకతను అనుభూతి చెందుతూ, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడవచ్చు. ఇలాంటి ఓవర్ల్యాండ్ బస్సు ప్రయాణాల చరిత్ర చాలా పాతది. 20వ శతాబ్దం మధ్యలో అంటే 1957లో 'ది ఇండియన్మాన్' అనే బస్సు సర్వీసు లండన్ నుంచి కోల్కతా వరకు నడిచేది. అప్పట్లో ఈ ప్రయాణాన్ని ఒక సాహసంగా పరిగణించేవారు. రౌండ్ ట్రిప్లో దాదాపు 20,300 మైళ్లు ప్రయాణించే ఈ బస్సు, ఒకవైపుకు చేరుకోవడానికి దాదాపు 50 రోజులు పట్టేది. 1957లో ఒకవైపు ప్రయాణానికి ఛార్జీ 85 పౌండ్లు, అంటే ఇప్పటి లెక్కల్లో సుమారు రూ.2.13 లక్షలు. ఇప్పుడు అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ అందిస్తున్న ఈ యాత్ర ఆనాటి సాహస యాత్ర స్ఫూర్తిని కొనసాగిస్తోంది.
0 Comments