హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. వాస్తవానికి ఈ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఐసీసీ వాయిదా వేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్కు పంపించలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ.. ఐసీసీని కోరింది. తమ ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించలేదు. దాంతో ఈ టోర్నీ నిర్వహణ ఐసీసీకి సవాల్గా మారింది. సుదీర్ఘ చర్చలు, సమావేశాల అనంతరం ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని, లేదంటే వేదికను మారుస్తామని పీసీబీ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక పీసీబీ కూడా భారత్ వేదికగా జరిగే తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇందుకు బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా జరిగిన సమావేశంలో హైబ్రిడ్ మోడల్కు ఇరు జట్లు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్ కొలంబో వేదికగా జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్ను అంగీకరించినందుకు పీసీబీకి ఐసీసీ మంచి ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 తర్వాత జరిగే మహిళల ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
0 Comments