ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ రాబోయే రోజులన్నీ తూర్పు, ఈశాన్య భారతావనివేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈశాన్య ప్రాంతం గొప్ప సంస్కృతి, చైతన్యవంతమైన వ్యక్తులతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అపారమైన సామర్థ్యంతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు చాలా కాలంగా ఓట్ల సంఖ్యతో అభివృద్ధిని ఎలా తూకం వేశాయో చూశామని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండటంతో గత పాలకులు అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని దుయ్యబట్టారు. ఢిల్లీ, ఈశాన్య ప్రాంత ప్రజల మనస్సులకు దూరమనే భావనను తగ్గించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పట్నుంచి ప్రయత్నించామన్నారు. ఈ దశాబ్ద కాలంలో కేంద్రమంత్రులు 700 సార్లు ఇక్కడ పర్యటించారని, ప్రజల మనోభావాలు, ఆర్థిక వ్యవస్థ, జీవావరణంతో ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.
0 Comments