బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్ల పోంజీ స్కామ్కు పాల్పడిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఫైనాన్షియల్ సర్వీస్, బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝలా అనే వ్యక్తి తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లోని పలు ప్రాంతాల ప్రజలను నమ్మించారు. కొద్దికాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈవిషయంపై మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థకు చెందిన గాంధీనగర్, ఆరావళి, సబర్కాంత, మెహసానా, వడోదరలోని కార్యాలయాలపై దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన పది మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. నాటినుంచి గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝలా పరారీలో ఉండడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఓ ఫామ్హౌస్లో అతడు దాక్కున్నట్లు సీఐడీ అధికారులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషన్ను స్థానిక కోర్టు కొట్టివేసినట్లు తెలిపారు. ప్రజల డబ్బుతో నిందితుడు పలు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామన్నారు.
0 Comments