Ad Code

కేజ్రీవాల్ ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని బీజేపీ ధ్వజం : సోషల్ మీడియాలో వీడియో పోస్టు !


సామాన్యుడిని అంటూ చెప్పుకునే కేజ్రీవాల్ ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారో చూడండి అంటూ బీజేపీ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ కోట్లు ఖర్చు చేసి ఇంటిని మార్పులు, చేర్పులు చేశారని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. లిక్కర్ స్కామ్‌లో దోచుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని కమలనాథులు ఆరోపించారు. ప్రజాధనంతో ఇంధ్రభవనాన్ని నిర్మించుకున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ 'ఎక్స్‌' ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్‌లో ఉన్న సీఎం బంగ్లా వీడియో అని పేర్కొంది. కేజ్రీవాల్.. సీఎంగా ఉన్నప్పుడు ఈ బంగ్లానే ఉపయోగించారని తెలిపారు. ఈ బంగ్లాను అద్దాల మేడగా అభివర్ణించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7-స్టార్‌ రిసార్ట్‌ నిర్మించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రానైట్‌, లైటింగ్‌ కోసం రూ.1.9 కోట్లు, ఇతరత్రా సివిల్‌ వర్క్‌ కోసం రూ.1.5 కోట్లు, జిమ్‌, స్పా వంటి వాటి కోసం రూ.35 లక్షలు.. ఇలా మొత్తంగా రూ.3.75 కోట్లు ఖర్చు చేసి ఈ భవనాన్ని లగ్జరీగా మార్చుకున్నారని ఆరోపించారు. కామన్‌ మ్యాన్‌ అని చెప్పుకునే కేజ్రీవాల్‌.. ప్రజల సొమ్మును ఇలా దోచుకున్నారో చూడండి అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ విడుదల చేసిన వీడియోపై ఆప్ మండిపడింది. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


Post a Comment

0 Comments

Close Menu