ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తాత్కాలిక సీఎంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తనను బాధించిందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా కేవలం ఆతిశీకే కాదని, రాష్ట్రపతి ప్రతినిధిగా తనకూ అవమానకరమని అన్నారు. కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలు ఢిల్లీ ప్రభుత్వ తీరుపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటూ సీఎంకు లెఫ్టినెంట్ గవర్నర్ సుదీర్ఘ లేఖ రాశారు. ''కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ మిమ్మల్ని (ఆతిశీ) తాత్కాలిక ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అది నాకు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది మీతో (సీఎం) పాటు మాకు కూడా అవమానకరమే. కేజ్రీవాల్ చెప్పిన తాత్కాలిక ముఖ్యమంత్రి అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేదే'' అని పేర్కొంటూ ముఖ్యమంత్రి అతిశీకి రాసిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. సీఎంకు వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పిన ఎల్జీ.. ముఖ్యమంత్రి అతిశీపై ప్రశంసలు కురిపించారు. మునుపటి ముఖ్యమంత్రి మాదిరిగా కాకుండా అనేక శాఖలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పాలనాపరంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం అతిశీని నెగటీవ్గా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం తనను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు.
0 Comments