Ad Code

కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్‌డీ విద్యార్థిని బలవన్మరణం !


హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్‌డీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని దీప్తిని వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతీనగర్ కాలనీకి చెందిన పులివర్తి దీప్తి (28) హబ్సిగూడలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలో అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీతరావు రెండేళ్ల క్రితం రూ. 15 లక్షలు తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని దీప్తి చెప్పినా వినిపించుకోలేదు. అనిల్ తన భార్యతో నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. దీంతో దీప్తి, సంగీతరావుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనిల్, అనిత కోర్టులో సివిల్ దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలో అనిల్ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం రాత్రి 10 గంటలకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడివుంది. దీప్తి ఫోన్ తీసి చూడగా అందులో సెల్పీ వీడియో ఉంది. 'నా మరణానికి అనిల్, అతని భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. నాన్న డబ్బు తీసుకుంటే నా మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి' అని కన్నీరుపెట్టుకుంటూ దీప్తీ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీప్తి తల్లి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు అనిల్, అనిల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య, సైదులుపై కేసు నమోదు చేశారు. సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu