అదానీ విల్మర్ కంపెనీలో తమకు ఉన్న 31.06 శాతం వాటాను విల్మర్ కంపెనీకి అమ్మేస్తామని అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. కంపెనీలో కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలనే నిబంధనలను అనుసరిస్తూ మిగతా 13 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని వెల్లడించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ విక్రయించనున్న వాటాల విలువ దాదాపు రూ.16వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2025 మార్చి 31వ తేదీకి ముందే ఈ విక్రయ ప్రక్రియ పూర్తవుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అదానీ విల్మర్ జాయింట్ వెంచర్ కంపెనీ బోర్డు నుంచి తాము నామినేట్ చేసిన డైరెక్టర్లు కూడా వైదొలగుతారని పేర్కొంది. అదానీ గ్రూప్ ఇకపై కేవలం ఇన్ఫ్రా రంగంపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. అందుకే వంటనూనెల బిజినెస్ నుంచి తప్పుకుంటోంది. అదానీ గ్రూపునకు వెన్నెముక లాంటి అదానీ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అదానీ ఎంటర్ప్రైజెస్ కింద అదానీ ఎయిర్పోర్ట్లు, సోలార్ మాడ్యుల్స్ తయారీ కంపెనీలు, విండ్ టర్బైన్లు, గ్రీన్ హైడ్రోజన్, రోడ్డు కన్స్ట్రక్షన్, డేటా సెంటర్, కాపర్ వ్యాపారాలు ఉన్నాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైనా.. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రికవర్ కాగలిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ కింద ఉన్న ఎయిర్పోర్ట్స్ బిజినెస్ విలువ రూ.1.87 లక్షల కోట్లు, రోడ్డు కన్స్ట్రక్షన్ బిజినెస్ విలువ రూ.52,056 కోట్లు, కోల్ బిజినెస్ విలువ రూ.29,855 కోట్లు, డేటా సెంటర్ బిజినెస్ విలువ రూ.11,003 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ అండ్ క్లీన్ ఎనర్జీ బిజినెస్ విలువ రూ.1.86 లక్షల కోట్లు, కాపర్ బిజినెస్ విలువ రూ.27,442 కోట్లు.
0 Comments