ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. సీఎం మాట్లాడారు. ''ప్రజా పాలన కోసం ఏడాది క్రితం ప్రజలు తీర్పు ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచాం. మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కాంగ్రెస్సే. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారం. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ను నిర్మించబోతున్నాం. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. 40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. టోక్యో, న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తాం. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుంది'' అని సీఎం తెలిపారు. ''గత సీఎం అబద్ధాలతో గడిపేశారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేశామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. కాలుష్యం పెరిగి.. దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్కతా నగరాలు నివసించేందుకు వీలు లేకుండా మారాయి. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నాం. మా ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి వ్యాపారం 29 శాతం పెరిగింది. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చుతోంది. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. తెలంగాణ, హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు? మెట్రోకు రూ.35 వేల కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్ రెడ్డి చెప్పాలి. గుజరాత్కు మోదీ నిధులు తీసుకెళ్తుంటే.. కిషన్ రెడ్డి చూస్తున్నారే తప్ప ఏం చేయడం లేదు. నిధులు తెస్తారో... గుజరాత్కు వలస వెళ్తారో కిషన్రెడ్డి చెప్పాలి. మూసీ పునరుజ్జీవానికి భారాస, భాజపా ఎందుకు అడ్డువస్తున్నాయో చెప్పాలి. అభివృద్ధి చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందని భారాస ఏడుస్తోంది'' అని రేవంత్రెడ్డి విమర్శించారు. ''హైదరాబాద్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నాం. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఈ సబ్కమిటీలో సభ్యులుగా ఉంటారు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తాం. రాష్ట్రాభివృద్ధికి భారాస, భాజపా ఉపసంఘానికి ప్రతిపాదనలు, సూచనలు ఇవ్వాలి. మేధావులు కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపాదనలు చేయాలి. సహేతుకంగా ఉంటే అమలు చేస్తాం. అంతేకానీ, ప్రభుత్వం ఏం చేసినా అడ్డుకుంటామంటే అంగీకరించం. తాత పేరో.. నాన్న పేరో చెప్పి ఈ కుర్చీలో కూర్చోలేదు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఎలా ఆపాలో మాకు తెలుసు'' అని సీఎం అన్నారు.
0 Comments